బంధం
భార్య భర్తల మధ్య అన్యోన్యత ఉంటేనే ఆ కాపురం చక్కగా ఉంటుంది. అందంగా ఉంటుంది. ఒకరినొకరు ప్రేమించడం అన్నిటికన్నా ఆరోగ్యకర మైన ప్రేమ. వారిద్దరి మధ్య ఎలాంటి కలహాలు లేకుండా చక్కగానడుచుకోగలుగుతారు. అలా కాకుండా ఇద్దరి మధ్య ఏదైనా చిన్న గ్యాప్ వస్తే, దాని వలన వచ్చే ఇబ్బందులు అన్నీఇన్నీ కాదు. చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా ఇద్దరు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
ఇద్దరిలో ఎవరిపైన తప్పు చేశారని తెలిసిన తరువాత ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమై గ్యాప్ మొదలౌతుంది. ఆ గ్యాప్ ను వీలైనంత త్వరగా సర్దుకుపోయి పూడ్చుకునే ప్రయత్నం చేయాలి తప్పించి, మరో విధంగా ఉండకూడదు. కేవలం అభిప్రాయాలను పంచుకునే విషయంలో మాత్రమే కాదు...శృంగారం విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. అప్పుడే భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది. ఇద్దరిలో ఎవరు తప్పు చేసినా దానిని భాగస్వామితో చెప్పి ఆ బంధాన్ని నిలబెట్టుకునే విధంగా చూసుకోవాలి. అంతేకాదు, జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా కొంతసమయం ఇంటికి, భాగస్వామికి కేటాయించినపుడు ఆ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. జీవితం అందంగా ప్రశాంతంగా సాగుతుంది.
'ఇంటి పేరు అనురాగం ముద్దుపేరు మమకారం మా ఇల్లే బృందావనం' అని ఓ సినీ కవి చెప్పినట్టుగా తన కుటుంబం ఎల్లప్పుడూ మమతానురాగాలతో వుండాలనే ప్రతిఒక్కరూ కోరుకుంటారు.
కుటుంబాన్ని ఒక్కొక్క సంస్కృతి ఒక్కొక్క విధంగా నిర్వచిస్తోంది. పాశ్చాత్య దేశాల్లో కుటుంబం అంటే- తల్లి, తండ్రి, పిల్లలు అంతే. అయితే అక్కడి సమాజంలో చోటుచేసుకుంటున్న అనేక మార్పులు, పెరిగిపోతున్న విడాకులు, గృహహింసల కారణంగా 'సింగిల్ పేరెంట్' కుటుంబాలు ఎక్కువౌతున్నాయి. వీటిలో తొంబై శాతం మహిళల పోషణలోనే వుంటు న్నాయి. భారతదేశంలో కుటుంబం అంటే- తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే కాదు... అత్తయ్యలు, మామయ్యలు, పెదనాన్నలు, పెద్దమ్మలు, బాబాయిలు, పిన్నమ్మలు, తాతయ్యలు, బామ్మలు, అమ్మమ్మలు- ఇలా పెనవేసుకున్న అనేక బంధాలు. అయితే ఇటువంటి కుటుంబాలు మన దేశంలో కూడా నిన్నటి మాటయిపోతున్నాయి. పట్టణీకరణ పెరుగుతుండడంతో ఉమ్మడి కుటుంబాటు కాస్తా న్యూక్లియర్ కుటుంబాలుగా మారిపోతున్నాయి. ఆధునిక పెట్టుబడిదారీ విధానం కుటుంబ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తోందని నగర జీవనాన్ని అధ్యయనం చేసిన వారంటున్నారు. మన దేశంలో కూడా పట్టణాల్లో తాగుడు, గృహహింస పెరగడం వల్ల కాపురాలు విచ్ఛిన్నమై కుటుంబాలను నడపాల్సిన బాధ్యతను మహిళలు చేపడుతున్నారు. అందువల్ల మన కుటుంబాలు కూడా పాశ్ఛాత్త దేశాల్లో మాదిరిగానే 'సింగిల్ పేరెంట్' కుటుంబాలుగా మారిపోతున్నాయి.
ప్రేమ, అభిమానాలను ఇచ్చిపుచ్చుకోడమనేది ఒక పద్ధతి. మనం ఎంత ప్రేమనైతే ఇవ్వగలుగుతామో... అంతే ప్రేమను ఎదుటివారూ మనకందిస్తారు. అంతేతప్ప కేవలం పుచ్చుకునే ధోరణితో ఏర్పడే బంధాలు ఎక్కువ కాలం నిలబడవు. ప్రేమకు ప్రాధాన్యత ఉన్నచోట డబ్బుకు ప్రాధాన్యత వుంటుందేమోగానీ... డబ్బుకి ప్రాధాన్యత ఉన్నచోట మాత్రం ప్రేమకు ప్రాధాన్యత వుండదు. 'సహజ మరణంతో సంబంధాలు ఎప్పుడూ మరణించవు... కానీ ఈ సంబంధాలు ఎల్లవేళలా ఈగో, స్వార్థం, పట్టించుకోకపోవడం వంటి వాటివల్లే మరణిస్తాయి'. అందుకే... ప్రేమ రాహిత్యం, స్నేహరాహిత్యం మానవ స్వభావానికి విరుద్ధం. మనుషులు సంఘజీవులు. అంతకు మించి కుటుంబ జీవులు. కుటుంబం బలమైన అనురాగ బంధాలకు మూలం. ప్రేమ, ఆప్యాయతలతో కూడిన కుటుంబ బంధం ఉండాలనుకోడం సహజం. అందుకే... కలిసి ఉంటే కలదు సుఖం అంటారు. కుటుంబంతో కలసి మనుగడ సాగించడంలోని గొప్పతనం... 'మనని మనం ఎవరికీ పరిచయం చేసుకోవలసిన అవసరం లేకుండా జీవితం గడపడమే'నని ఒక మేధావి పేర్కొంటారు. అదీ కుటుంబ వ్యవస్థకున్న ప్రాధాన్యత. అలాంటి కుటుంబ వ్యవస్థ నాశనం కాకుండా కాపాడు కోవలసిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబంలో ప్రజాస్వామ్య యుతమైన మార్పులు నెలకొనాలి. ప్రేమించడానికి హృదయం వుండాలి. ప్రేమింపబడడానికి వ్యక్తిత్వం వుండాలి.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి